ప్రజల కోసం ప్రశ్నించే ఏకైక సింహం జగన్: కొడాలి నాని
- జగన్ నేతృత్వంలో వైసీపీ కీలక సమావేశం
- చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారన్న కొడాలి నాని
- వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్న పేర్ని నాని
వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. అనంతరం మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు రెండేళ్ల పాలనలోని వైఫల్యాలను, ప్రజలకు జరిగిన నష్టాలను ఎండగడతామని వారు స్పష్టం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలు కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పోరాడాలని క్యాడర్కు కొడాలి నాని పిలుపునిచ్చారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని, లోకేశ్ ఒక్క శాఖను కూడా సరిగ్గా నడపలేకపోతున్నారని విమర్శించారు. దమ్ముంటే చంద్రబాబు జగన్తో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల కోసం ప్రశ్నించే ఏకైక సింహం జగన్ అని, గుంపులుగా వచ్చేది వాళ్లేనని నాని ధ్వజమెత్తారు.
పేర్ని నాని మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' హామీలను తుంగలో తొక్కి, బాండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్ 4 నుంచి జూన్ 12 వరకు 'వెన్నుపోటుకు రెండేళ్లు' అనే పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు చేస్తున్న 'గొడ్డలి పార్టీ' వ్యాఖ్యలు కేవలం డైవర్షన్ రాజకీయాలేనని ఆయన కొట్టిపారేశారు.